జీవీఎంసీ కార్యాలయం ఎదుట వైసీపీ కార్పొరేటర్ల నిరసన
- జీవీఎంసీని తాకిన ఉక్కు సెగ
- నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన వైసీపీ కార్పొరేటర్లు
- స్టీల్ ప్లాంట్ను కాపాడాలంటూ ప్లకార్డులతో ఆందోళన
కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు నల్ల దుస్తులు ధరించి హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ను కాపాడాలంటూ సభలో నినాదాలు చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, వైసీపీ సభ్యులు ఈ విధంగా తమ నిరసన తెలిపారు. కేంద్రం జారీ చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని వారు కోరారు.
సమావేశానికి ముందు జీవీఎంసీ కార్యాలయం వద్ద కూడా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. "విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు" అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.