ASI: సరస్వతీ నది, మహాభారత కాలంనాటి ఆనవాళ్లు.. రాజస్థాన్‌లో 4,500 ఏళ్ల నాటి నాగరికత వెలుగులోకి!

ASI Unearths 4500 Year Old Civilization in Rajasthan Near Saraswati River
షార్ట్స్‌లో చూడండి
భారత చరిత్ర పుటల్లో మరో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. రాజస్థాన్‌లోని దీగ్ జిల్లాలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన తవ్వకాల్లో సుమారు 4,500 సంవత్సరాల క్రితం నాటి పురాతన నాగరికతకు సంబంధించిన అద్భుతమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల్లో ఋగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతీ నదికి సంబంధించిన పురాతన ప్రవాహ మార్గం (పేలియో ఛానల్) బయటపడటం చారిత్రక వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

దీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో ఈ ఏడాది జనవరి 10న ఏఎస్ఐ తవ్వకాలను ప్రారంభించింది. సుమారు 23 మీటర్ల లోతు వరకు జరిపిన ఈ పరిశోధనలు, రాజస్థాన్ చరిత్రలోనే అత్యంత లోతైనవిగా నిలిచాయి. ఇక్కడ బయటపడిన ప్రాచీన నదీ ప్రవాహ మార్గం, ఒకప్పుడు సరస్వతీ నదీ వ్యవస్థలో భాగమై ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నదీ తీరంలోనే తొలినాటి మానవ ఆవాసాలు ఏర్పడి, మధుర, బ్రజ్ ప్రాంతాలతో సాంస్కృతిక సంబంధాలు కొనసాగించి ఉంటాయని ఏఎస్ఐ సైట్ హెడ్ పవన్ సారస్వత్ తెలిపారు.

ఒకే చోట ఐదు యుగాల ఆధారాలు.. మహాభారత కాలం నాటి ఆనవాళ్లు

ఈ తవ్వకాల ప్రత్యేకత ఏమిటంటే, ఒకే ప్రదేశంలో ఐదు వేర్వేరు చారిత్రక కాలాలకు చెందిన ఆధారాలు బయటపడటం. హరప్పా అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం నాటి నాగరికతలు ఇక్కడ విలసిల్లినట్లు స్పష్టమైంది. ముఖ్యంగా మహాభారత కాలం నాటి పొరల్లో లభించిన మట్టిపాత్రలు, యజ్ఞ కుండాలు (హవన కుండాలు) ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఈ మట్టిపాత్రలపై ఉన్న చిత్రాలు, మహాభారతంలో వర్ణించిన వస్త్రాలు, పాత్రలను పోలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

తవ్వకాల్లో ఇప్పటివరకు 800కు పైగా కళాఖండాలు లభ్యమయ్యాయి. వాటిలో పురాతన బ్రాహ్మీ లిపి ముద్రలు, రాగి నాణేలు, మౌర్యుల కాలం నాటి శిల్పాలు, శివపార్వతుల విగ్రహాలు, ఎముకలతో చేసిన పనిముట్లు ఉన్నాయి. మౌర్యుల కాలం నాటి మాతృ దేవత శిరస్సుగా భావిస్తున్న ఒక విగ్రహం ఇక్కడ దొరికింది. గుప్తుల కాలం నాటి నిర్మాణ శైలిని ప్రతిబింబించే మట్టి గోడలు, స్తంభాలు, లోహ పరిశ్రమకు సంబంధించిన కొలుములు కూడా బయటపడ్డాయి. సూదులు, దువ్వెనలు, అచ్చులు వంటి ఎముకలతో చేసిన పనిముట్లు ఈ రూపంలో దేశంలో లభించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వేదకాలం నాటి సంస్కృతికి సాక్ష్యాలు

ఈ ప్రాంతంలో 15కు పైగా యజ్ఞ కుండాలు లభించడం, వేద, ఉత్తర వేద కాలాల్లో ఇక్కడ మతపరమైన కర్మకాండలు విస్తృతంగా జరిగాయని నిర్ధారిస్తోంది. శక్తి, భక్తి సంప్రదాయాలకు ప్రతీకలైన శివపార్వతుల మట్టి విగ్రహాలు, ఆనాటి వర్తక, సౌందర్య సంప్రదాయాలను తెలిపే శంఖు గాజులు, విలువైన రాతి పూసలు కూడా దొరికాయి. తవ్వకాల్లో ఒక మానవ అస్థిపంజరం కూడా లభ్యం కాగా, దానిని కాల నిర్ధారణ పరీక్షల కోసం ఇజ్రాయెల్‌కు పంపించారు.

ఈ ఆవిష్కరణలు రాజస్థాన్ చరిత్రకే కాకుండా యావత్ ఉత్తర భారతదేశ ప్రాచీన చరిత్ర అధ్యయనానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి. ఏఎస్ఐ ఇప్పటికే ఈ వివరాలతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఒక నివేదిక సమర్పించింది. త్వరలోనే ఈ ప్రాంతాన్ని "జాతీయ పురావస్తు సంరక్షిత ప్రాంతం"గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 
Go Back to Shorts
ASI
Archaeological Survey of India
Rajasthan
Saraswati River
Ancient Civilization
Deeg district
Indian History
Harappan Civilization
Mahabharata
Pawan Saraswat

More Telugu News