న్యూయార్క్ మేయర్ రేసులో సంచలనం.. క్యూమోను ఓడించిన భారత సంతతి జోహ్రాన్ మమ్దానీ!
- న్యూయార్క్ నగర మేయర్ ప్రైమరీలో జోహ్రాన్ మమ్దానీ విజయం
- మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై సంచలన గెలుపు
- మమ్దానీకి 43.5%, క్యూమోకు 36.3% ఓట్లు
- సోషలిస్ట్ భావజాలమున్న మమ్దానీకి యువత మద్దతు
- ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే ఈ జోహ్రాన్
అమెరికాలోనే అతిపెద్ద నగరమైన న్యూయార్క్లో జరిగిన ఈ హోరాహోరీ పోరులో మమ్దానీకి 43.5 శాతం ఓట్లు రాగా, ఆండ్రూ క్యూమో 36.3 శాతంతో వెనుకంజలో నిలిచారు. రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లు మూడు రెట్లు అధికంగా ఉన్న ఈ నగరంలో దాదాపు డజను మంది డెమోక్రటిక్ అభ్యర్థులు మేయర్ పీఠం కోసం పోటీ పడ్డారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న జోహ్రాన్ మమ్దానీ, ప్రఖ్యాత భారత-అమెరికన్ చిత్రనిర్మాత మీరా నాయర్, ఉగాండాలో జన్మించిన భారతీయ విద్యావేత్త మహమూద్ మమ్దానీల కుమారుడు.
డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా మద్దతుతో బరిలోకి దిగిన మమ్దానీ, తక్కువ ఖర్చుతో కూడిన గృహాలు, పోలీసు సంస్కరణలు, వాతావరణ మార్పులపై చర్యలు వంటి ప్రగతిశీల అంశాలతో ప్రచారం నిర్వహించారు. తన విజయానంతరం మమ్దానీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, నెల్సన్ మండేలా మాటలను ఉటంకించారు. "ఇది పూర్తయ్యే వరకు అసాధ్యంలానే కనిపిస్తుంది. మిత్రులారా ఇది పూర్తయింది. దాన్ని చేసింది మీరే. న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా ఎంపికైనందుకు నేను గర్వపడుతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
గతేడాది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి తిరిగి వచ్చిన నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న ప్రస్తుత సున్నిత తరుణంలో ఈ ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. చురుకైన సోషల్ మీడియా ప్రచారం, యువ ఓటర్ల మద్దతుతో మమ్దానీ సాధించిన ఈ విజయం పార్టీలోని వామపక్ష వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపింది.