Nara Lokesh: చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Calls for Educated Youth to Join Politics at DVR Sainik School Launch
షార్ట్స్‌లో చూడండి
బాగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి చురుగ్గా ప్రవేశించి దేశానికి సేవ చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు, గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను, గురువులు, తల్లిదండ్రులు, సైనికుల పట్ల గౌరవాన్ని నొక్కి చెప్పారు.

ముందుగా సైనిక్ స్కూల్ ప్రధాన భవనం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, బాలుర, బాలికల వసతి గృహాలు, క్యాంటీన్, మెస్ భవనాలను డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్‌తో కలిసి మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను ఆవిష్కరించారు.

గురువులు దైవసమానులు, తల్లుల త్యాగాలు మరువలేనివి

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేశ్ ప్రసంగిస్తూ, "గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరః అంటారు. మన జీవితంలో పుట్టినప్పటి నుంచి చివరి వరకు గురువులు కీలక పాత్ర పోషిస్తారు. నేను పదో తరగతి వరకు భారతీయ విద్యాభవన్‌లో, ఇంటర్ లిటిల్ ఫ్లవర్‌లో చదివాను. ఆనాటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్ రాజ్ రెడ్డి గారు వంటి ఎంతో మంది గురువులు ఇప్పటికీ నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అందుకే గురువులను దేవుడితో సమానంగా గౌరవించాలి" అని తెలిపారు.

తల్లుల గొప్పతనాన్ని వివరిస్తూ, "మనల్ని షరతులు లేకుండా ప్రేమించేది అమ్మ మాత్రమే. సుందర్ పిచాయ్ తల్లి ఆయన కోసం ఎన్నో త్యాగాలు చేశారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు. అది విని నేను ఆశ్చర్యపోయాను. తల్లుల త్యాగాల వల్లే మనం చదువుకోగలుగుతున్నాం, ఈ స్థాయికి చేరుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ తల్లులను గౌరవించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి" అని విద్యార్థులకు హితవు పలికారు.

విద్యతోనే పేదరికం దూరం – దగ్గుబాటి కుటుంబ సేవలు ప్రశంసనీయం

మారుమూల ప్రాంతంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడంపై లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. "పేదరికం నుంచి బయటపడాలంటే అద్భుతమైన విద్యను అందించాలి. విద్యతోనే జీవితాల్లో మార్పు వస్తుంది. ఈ విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, దూరదృష్టి కలిగిన దగ్గుబాటి చెంచురామయ్య గారు 1980లలోనే గ్రహించి ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు స్థాపించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారు" అని కొనియాడారు. "ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పెద్దమ్మ దగ్గుబాటి పురందేశ్వరి, వారి పిల్లలు హితేష్, నివేదిత అద్భుతమైన విద్యాసంస్థలు నెలకొల్పారు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కుటుంబం పనిచేయడం, ఈ ఏడాది సైనిక్ స్కూల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది" అని అభినందించారు.

"పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పనిచేయాలనే దృక్పథంతో ఈ సైనిక్ స్కూల్‌ను నెలకొల్పారు. గతంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎనలేని సేవలందించారు. ఇప్పుడు మూడో తరం ప్రతినిధిగా హితేష్ కూడా తాత, తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుండటం ఆనందదాయకం. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది" అని మంత్రి హామీ ఇచ్చారు.

సైనికుల త్యాగాలు మరువలేనివి

సైనిక్ స్కూల్ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ, "పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రధాని మోదీ ధీటుగా ఎదుర్కొని శత్రువులకు గుణపాఠం చెప్పారు. మన సైనికులు మన కోసం నిలబడుతున్నారు. జవాన్ మురళీనాయక్ వంటి వీరులు దేశం కోసం ప్రాణాలర్పించారు. ఆయన తల్లిదండ్రులను నేను పరామర్శించాను. తల్లిదండ్రులు వద్దన్నా దేశసేవకే అంకితమయ్యారు. సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉన్నాం. అలాంటి గొప్ప సైనికులను అందించడానికే ఈ సైనిక్ స్కూల్. మన ప్రాంత సైనికులు తిరిగి వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి గౌరవంగా సెల్యూట్ చేయాలి," అని లోకేశ్ ఉద్ఘాటించారు.

నేను రెండు సవాళ్లు స్వీకరించాను

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, "పరీక్షల్లో విఫలమైతే ఆత్మహత్యలు చేసుకోవద్దు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కష్టమైన మార్గాన్నే ఎంచుకోవాలి. నేను రెండు సవాళ్లు స్వీకరించాను. మొదటిది... 40 ఏళ్లుగా గెలవని మంగళగిరిలో పోటీచేసి తొలిసారి ఓడినా, రెండోసారి కసితో పనిచేసి రాష్ట్రంలో మూడో అత్యధిక మెజారిటీతో గెలిచాను. నన్ను ఎంతో ఎగతాళి చేశారు, అయినా గెలుపే లక్ష్యంగా పనిచేశా. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు" అన్నారు. విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించడం రెండో సవాల్ అని వెల్లడించారు. ప్రభుత్వ విద్య ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని, రాష్ట్ర విద్యావ్యవస్థను దేశం మొత్తం చూసేలా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. విశాఖలో 3 లక్షల మందితో యోగాసనాలు వేయించి గిన్నిస్ రికార్డ్ సాధించామని గుర్తుచేశారు.

యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, అనేక పెట్టుబడులు తీసుకువస్తున్నామని తెలిపారు. "బాగా చదువుకుని, జీవితంలో స్థిరపడి, దేశంలో మార్పు తీసుకురావడానికి, సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలి" అని యువతకు పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముందు కళాశాల ప్రాంగణానికి విచ్చేసిన మంత్రి లోకేశ్ మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్ తదితరులు ఘనస్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎంఎమ్ కొండయ్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీ, బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
DVR Sainik School
Andhra Pradesh Education
Daggubati Venkateswara Rao
Bapatla District
Youth in Politics
Education Importance
Hitesh Chenchuram
Purandeswari Daggubati
Telugu News

More Telugu News