Shobha Karandlaje: ఆపరేషన్ సిందూర్ ను అవమానిస్తే మహిళల ఉసురు తగులుతుంది: శోభ కరంద్లాజె

Shobha Karandlaje Condemns Congresss Doubts on Operation Sindhoor
షార్ట్స్‌లో చూడండి
'ఆపరేషన్ సిందూర్' విజయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి వారిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాకిస్థాన్‌ యాత్రకు పంపాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. 

బెంగళూరులోని బ్యాటరాయనపుర అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. "ఆపరేషన్ సిందూర్‌లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న వాదనను శంకిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్ వెళ్లి స్వయంగా తెలుసుకోవాలి. కనీసం ఏడాది పాటు వారిని అక్కడే ఉంచాలి" అని ఆమె అన్నారు. పాకిస్థాన్‌పై దాడుల విషయంలో కేంద్రానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధమైన ప్రకటనలు చేయడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానం ఆదేశాలతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే అనుమానం కూడా ఆమె వ్యక్తం చేశారు.

"మన సాయుధ బలగాలు పాకిస్థాన్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అక్కడి ప్రభుత్వం కూడా చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చింది. అయినా కాంగ్రెస్ నేతలు మన సైనికులను అవమానిస్తున్నారు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు అడిగారు, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌కు సాక్ష్యాలు కావాలంటున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పార్టీ నేతలను అదుపులో పెట్టాలి. లేదంటే వారిని పాకిస్థాన్ పంపించాలి" అని కేంద్రమంత్రి శోభ పునరుద్ఘాటించారు.

కర్ణాటక గృహనిర్మాణ, వక్ఫ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తాను ఆత్మాహుతి బాంబర్‌గా మారతానంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా ఆమె తీవ్రంగా స్పందించారు. "ఖాన్ అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, బదులుగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడం మేలు" అని ఆమె వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా శోభ కరంద్లాజే విమర్శలు గుప్పించారు. "మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేయాలంటే ఎన్నికల సమయంలో చేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ సంక్షోభ సమయాల్లో కూడా రాజకీయాలు చేస్తోంది" అని ఆమె ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ గురించి అహేతుక ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు మహిళల శాపం తగులుతుందని కూడా అన్నారు. "మరణాలపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది అని ఆమె దుయ్యబట్టారు.



Go Back to Shorts
Shobha Karandlaje
Operation Sindhoor
Congress
Karnataka
Siddaramiah
Rahul Gandhi
Surgical Strikes
Pakistan
Terrorism
India

More Telugu News