Antonio Guterres: భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ.. స్పందించిన ఐక్య రాజ్య సమితి

- భారత్, పాకిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం
- ఉద్రిక్తతలు తగ్గించే అన్ని ప్రయత్నాలను స్వాగతించిన ఐరాస
- అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరినట్లు వెల్లడి
భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించడంతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శాంతియుత చర్యను ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్వాగతించారు.
శనివారం ఈ విషయంపై ఐరాస స్పందించింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న అన్ని రకాల ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని గుటెర్రస్ పేర్కొన్నట్లు ఆయన ఉప ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు.
"మేము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము. అయితే వివాదాన్ని తగ్గించే అన్ని ప్రయత్నాలను మేము స్వాగతిస్తున్నాము" అని ఫర్హాన్ హక్ పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా ఇరు దేశాలు ఒకరి సైనిక స్థావరాలపై మరొకరు దాడులు చేసుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చి, ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణకు మార్గం సుగమమైందని ట్రంప్ ప్రకటించారు.