Vikram Misri: ఆఫ్ఘనిస్థాన్ వైపు భారత్ మిసైల్స్ ప్రయోగిస్తోందన్న పాక్ ఆర్మీ.. తీవ్రంగా స్పందించిన విక్రమ్ మిస్రీ

- పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
- 'ఆపరేషన్ సింధూర్' చేపట్టినప్పటి నుంచి పాక్ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం
- ఆఫ్ఘనిస్థాన్ ను భారత్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రకటన ఖండన
- గతంలో ఆఫ్ఘన్ ప్రజలను ఎవరు లక్ష్యంగా చేసుకున్నారో అందరికీ తెలుసునని వ్యాఖ్య
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో, పాకిస్థాన్ అనవసర ఆరోపణలతో అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న తరుణంలో, పాకిస్థాన్ చేస్తున్న కుతంత్రాలను, ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ను భారత్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటోందని పాక్ చేస్తున్న నిరాధార ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
ఆఫ్ఘనిస్థాన్ను లక్ష్యంగా చేసుకుని భారత్ క్షిపణి ప్రయోగాలు చేపడుతోందంటూ పాకిస్థాన్ సైనిక అధికారులు చేసిన తప్పుడు ప్రకటనలపై విక్రమ్ మిస్రీ స్పందించారు.
"పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరధారమైనవి. ఆఫ్ఘన్ ప్రజలకు మా దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా అక్కడి మౌలిక సదుపాయాలను, ప్రజలను ఎవరు లక్ష్యంగా చేసుకుంటున్నారో (పరోక్షంగా పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ) ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదని భావిస్తున్నాను. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం సొంత దేశ ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకతను, విమర్శలను ఎదుర్కొంటోంది" అని మిస్రీ తెలిపారు.
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకే పాకిస్థాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆయన పరోక్షంగా సూచించారు.
పాకిస్థాన్ ఆర్మీ అధికారుల తీరును విమర్శిస్తూ, "భారత ప్రభుత్వంపై ఇక్కడి పౌరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తారని, తద్వారా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతుందని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధులు భ్రమల్లో సంతోషం వెతుక్కుంటున్నారు. కానీ, అనూహ్యంగా పాకిస్థాన్ ప్రజలే తమ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడంతో ఆశ్చర్యపోవాల్సిన దుస్థితి వారికి ఎదురైంది" అని మిస్రీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదానికీ ఒక నిర్దిష్టమైన విధానం ఉంటుందని, ఆ విషయం పాకిస్థాన్కు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించదని ఆయన ఎద్దేవా చేశారు.