Neeraj Chopra: భారత్-పాక్ ఉద్రిక్తతలు... ఈవెంట్ వాయిదా వేసుకున్న నీరజ్ చోప్రా

- భారత్ – పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ వాయిదా నిర్ణయం
- అందరితో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చోప్రా వెల్లడి
భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో జావెలెన్ త్రోయర్ నీరజ్ చోప్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పేరుతో తొలిసారి నిర్వహించ తలపెట్టిన నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తానని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 24న నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. విమానయాన సంస్థలు సర్వీసులను నిలిపివేయడం వల్ల టోర్నీ నిర్వహణ సాధ్యపడదని గ్రహించిన చోప్రా క్లాసిక్ టోర్నమెంట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదని, అందరితో చర్చించిన తర్వాతనే వాయిదానే మంచిదని భావించామన్నారు. సైనికులు, దేశానికి మద్దతుగా నిలవడం ముఖ్యమని అనుకున్నామని, ఈ కఠిన సమయంలో మా అందరి ప్రార్థనలు భారత సైన్యం చుట్టూనే తిరుగుతుంటాయన్నారు. జై హింద్ అంటూ ఎక్స్ వేదికగా నీరజ్ పోస్ట్ చేశారు.
ఈ ఈవెంట్కు గానూ చోప్రా ఏప్రిల్ నెలలోనే ప్రముఖ అథ్లెట్లకు ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలోనే పాకిస్థానీ జావెలిన్ త్రోయర్, తన స్నేహితుడు అర్షద్ నదీమ్కు భారత్ రావాల్సిందిగా చోప్రా ఆహ్వానించారు. దీంతో శత్రుదేశం అథ్లెట్ను పోటీలకు పిలుస్తావా అంటూ అతనిపై ట్రోలింగ్ చేశారు.
దీనిపై బాధపడిన చోప్రా విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండు ఒలింపిక్ పతకాలు అందించిన తన దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. అందరు ఆటగాళ్లను పిలిచినట్లుగానే నదీమ్కు ఆహ్వానం పంపినట్లు తెలిపారు.