Kamal Haasan: తన కొత్త సినిమా ఆడియో ఫంక్షన్ వాయిదా వేసుకున్న కమల్ హాసన్

- భారత్-పాక్ ఉద్రిక్తతలు
- దేశవ్యాప్తంగా అప్రమత్తత
- వేడుకలు చేసుకోవడానికి ఇది సమయం కాదన్న కమల్ హాసన్
- మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' చిత్రంలో నటిస్తున్న కమల్
దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమిళనాడులో ప్రముఖులు సైనికులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. నటుడు కమల్ హాసన్ తన సినిమా కార్యక్రమాన్ని వాయిదా వేయగా, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ప్రతిపక్ష నేత పళనిస్వామి కీలక పిలుపునిచ్చారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'థగ్ లైఫ్' ఆడియో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో వేడుక మే 16న జరగాల్సి ఉండగా, దేశంలో నెలకొన్న అప్రమత్తత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
"మన మాతృభూమి రక్షణ కోసం సైనికులు సరిహద్దుల్లో అచంచలమైన ధైర్యంతో నిలబడినప్పుడు, ఇది వేడుకల సమయం కాదని, మౌనంగా సంఘీభావం తెలపాల్సిన సమయమని నేను నమ్ముతున్నాను" అని కమల్ హాసన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. "పౌరులుగా, సంయమనంతో, సంఘీభావంతో స్పందించడం మన కర్తవ్యం" అని ఆయన అన్నారు. సినిమా ఆడియో విడుదల కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
సీఎం స్టాలిన్ సంఘీభావ యాత్రకు పిలుపు, విద్యార్థుల భద్రతపై హామీ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సైనికులకు సంఘీభావం తెలుపుతూ రేపు (గురువారం) చెన్నైలో భారీ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. మెరీనా వద్ద డీజీపీ కార్యాలయం నుంచి ఐలాండ్ గ్రౌండ్ వరకు ఈ యాత్ర సాగనుంది. మంత్రులు, మాజీ సైనికోద్యోగులు, విద్యార్థులు ఈ యాత్రలో పాల్గొననున్నారు.
కశ్మీర్లో చదువుతున్న 52 మంది తమిళనాడు విద్యార్థులు, పర్యటనకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో, ప్రభుత్వం వారి భద్రతకు అన్ని చర్యలూ తీసుకుందని స్టాలిన్ హామీ ఇచ్చారు. కేంద్రపాలిత ప్రాంత అధికారులతో మాట్లాడుతున్నామని, పరిస్థితులు చక్కబడ్డాక వారిని చెన్నైకి విమానంలో తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు ఈ రాత్రికి ఢిల్లీ చేరుకుని, రేపు ఉదయం స్వస్థలాలకు తిరిగి రానున్నారని ఆయన వివరించారు.