Vikram Misri: 400 డ్రోన్లతో పాకిస్థాన్ దాడి... పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంది: విక్రమ్ మిస్రీ

- భారత్లోని 36 సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్ల దాడి
- 300-400 డ్రోన్లతో గురువారం రాత్రి దాడులకు పాల్పడిన పాక్
- భారత సైనిక స్థావరాలు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు
- పౌర విమానాలను రక్షణ కవచంగా పాక్ వాడుతోందని భారత్ ఆరోపణ
భారత్లోని కీలక సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ గురువారం రాత్రి భారీ స్థాయిలో డ్రోన్ల దాడికి పాల్పడిందని భారత ప్రభుత్వం వెల్లడించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని సుమారు 36 ప్రాంతాలపై 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించిందని భారత సైన్యం తెలిపింది. ఈ దాడుల వెనుక భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచారాన్ని సేకరించడమే పాక్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది.
'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు ఈ సంచలన విషయాలను తెలిపారు.
గురువారం రాత్రి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగి, నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలకు పాల్పడుతూ భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించిందని వారు వివరించారు. పాక్ వైపు నుంచి వచ్చిన అనేక డ్రోన్లను భారత బలగాలు కూల్చివేశాయని, ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారని వారు పేర్కొన్నారు. పంజాబ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తత కొనసాగుతోందని, పాక్ దాడులను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుందని తెలిపారు. దాడుల కోసం టర్కీకి చెందిన 'ఆసిస్గార్డ్ సోంగర్' రకం డ్రోన్లను పాకిస్థాన్ ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందన్నారు.
పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుంది
ఈ దాడుల సందర్భంగా పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుందని భారత రక్షణ శాఖ ప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించినప్పటికీ, కరాచీ, లాహోర్ మధ్య పౌర విమాన సర్వీసులను నిలిపివేయలేదని వారు తెలిపారు. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన వస్తుందని తెలిసి కూడా, పౌర విమానాలను అడ్డుపెట్టుకోవడం ద్వారా పాకిస్థాన్ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని అన్నారు.
ఇది భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ప్రయాణించే విమానాలతో పాటు, పాకిస్థాన్లోని పౌర విమానాలకు కూడా సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పాకిస్థాన్ ప్రార్థనా మందిరాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.
అంతర్జాతీయ విమానయాన నిబంధనలను, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాయుసేన పూర్తి సంయమనంతో వ్యవహరించిందని కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు స్పష్టం చేశారు. పాకిస్థాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి కవ్వింపు చర్యలను భారత్ ఉపేక్షించబోదని వారు హెచ్చరించారు.