పూంఛ్, తంగ్ధర్ సెక్టారులో రాత్రి నుంచి పాక్ బలగాల కాల్పులు: ఇండియన్ ఆర్మీ
- ఎల్ఓసీ వెంట పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
- పాక్ కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి, 43 మందికి గాయాలైనట్లు వెల్లడి
- భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాక్ కాల్పులు
గత కొంతకాలంగా ఎల్ఓసీ పొడవునా పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, పహల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది.
ఈ దాడుల నేపథ్యంలో, బుధవారం నాడు పాకిస్థాన్ రేంజర్లు పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలోని భారతీయ గ్రామాలపై గుళ్ల వర్షం కురిపించారు. గత రాత్రి నుంచి ఈ కాల్పులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, సాధారణ పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు దాడులకు తెగబడుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.