NTR: ఎన్టీఆర్ గారి ఇంట్లో ప్రత్యేక కుర్చీ ఆ దర్శకుడి కోసం మాత్రమే!

- అప్పట్లో కేవీరెడ్డి గారు గొప్ప దర్శకులు
- సినిమాకి లక్ష తీసుకునేవారు
- ఆయనంటే ఎన్టీఆర్ కి గురుభావం
- ఎంతగానో ఆయనను గౌరవించేవారన్న నిర్మాత
ఎన్టీ రామారావు గురించిన విషయాలను తెలుసుకోవడానికి ఆయన అభిమానులు ఎప్పుడూ కుతూహలాన్ని చూపుతూ ఉంటారు. ఆయన గురించి 'అన్న ఎన్టీఆర్' యూ ట్యూబ్ ఛానల్ తో సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. "దర్శకులు కేవీరెడ్డిగారిని ఎన్టీఆర్ గారు గురువుగా భావించేవారు... గౌరవించేవారు. ఎన్టీఆర్ గారి ఇంట్లో ఒక కుర్చీ ఉండేది... అది కేవీరెడ్డి గారి కోసమే వేయించేవారు. ఆ కుర్చీలో కేవీ రెడ్డిగారు తప్ప వేరొకరు కూర్చున్నది లేదు. ఇప్పటికీ ఆ కుర్చీ ఉంది" అని అన్నారు.
"కేవీరెడ్డిగారు చాలా క్రమశిక్షణ కలిగిన దర్శకులు, 'దొంగరాముడు' సినిమాను 6 లక్షలలో తీస్తానని ఆయన నిర్మాతలతో చెప్పారు. అయితే సినిమా పూర్తయ్యేసరికి 6 లక్షల పాతికవేల ఖర్చు అయింది. పైన పాతికవేలు కేవీ రెడ్డిగారు భరించడం ఆయన నిజాయతీకి నిదర్శనం. ఆ సినిమాకి ఆయన పారితోషికం లక్షరూపాయలైతే, అక్కినేని తీసుకున్నది కేవలం 20 వేలు మాత్రమే. ఆ రోజులలో దర్శకుడిగా ఆయనకి గల డిమాండ్ అలాంటిది" అని అన్నారు.
"ఒకానొక సమయంలో కేవీరెడ్డిగారితో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఆలోచన చేశారు. అలాంటి సమయంలో కూడా తన సొంత బ్యానర్లో కేవీ రెడ్డిగారితో సినిమా చేయడానికి సిద్ధపడినవారు ఎన్టీఆర్. తన వయసు సహకరించదేమోనని కేవీరెడ్డిగారు అంటే, తాను హెల్ప్ చేస్తూ ఉంటానంటూ ఆయనను ఎన్టీఆర్ ఉత్సాహపరిచేవారు" అంటూ చెప్పారు.