Nara Lokesh: సింహాచలం దుర్ఘటనపై మంత్రి లోకేశ్, పురందేశ్వరి దిగ్భ్రాంతి

- ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్న మంత్రి లోకేశ్
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
- క్యూలైన్లో ఉన్న ఏడుగురి మృతి బాధాకరమన్న పురందేశ్వరి
- దుర్ఘటనపై రాష్ట్ర మంత్రుల సంతాపం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. క్షతగాత్రులకు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హోంమంత్రి అనిత ప్రమాదస్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.
స్వామివారి దర్శనం కోసం వెళ్లి.. ఏడుగురు చనిపోవడం బాధాకరం: పురందేశ్వరి
సింహాచలం దుర్ఘటనపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో ఉన్న ఏడుగురు భక్తుల మృతి బాధాకరమన్నారు. స్వామివారి చందనోత్సవ సమయాన ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అటు ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.