Satya Kumar: వైసీపీ నేతలు ఇంటి దగ్గర పడుకుని డ్రామాలు ఆడుతున్నారు: సత్యకుమార్

- టీటీడీ గోశాలలో వయసు రీత్యా, అనారోగ్యంతో 44 ఆవులు చనిపోయాయన్న సత్యకుమార్
- దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్ కు హవాలా మార్గంలో రూ. 720 కోట్లు వచ్చాయన్న మంత్రి
- లిక్కర్ స్కామ్ లో అందరి పేర్లు బయటకు వస్తాయని వ్యాఖ్య
వైసీపీ నేతలపై బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. టీటీడీ గోశాల వంటి సున్నితమైన అంశాన్ని కూడా వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగారంటూ ఆయన మండిపడ్డారు. గత మూడు నెలల కాలంలో 44 ఆవులు చనిపోయాయనేది నిజమేనని... వయసు రీత్యా, అనారోగ్య కారణాలతో అవి మృతి చెందాయని చెప్పారు. వేల ఆవులు ఉన్న చోట ఇలాంటి మరణాలు సహజమేనని అన్నారు.
గోశాలలో ఏం జరుగుతోందో చూపిస్తాం రమ్మంటే రాకుండా వైసీపీ నేతలు ఇంటి దగ్గర పడుకుని డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
మడకశిరలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
క్విడ్ ప్రోకోలో భాగంగా దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్ కు హవాలా మార్గంలో రూ. 720 కోట్లు వచ్చాయని... అందుకే దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని సత్యకుమార్ అన్నారు. మదనపల్లిలో రికార్డుల దహనం కేసులో కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. తిరుమల కల్తీ నెయ్యి, వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లు బయటకు వస్తాయని అన్నారు. కోడికత్తి, బాబాయ్ గుండెపోటు విషయాల్లో వైసీపీ ఎలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసిందో అందరికీ తెలుసని చెప్పారు.