Ganta Srinivasa Rao: థాంక్యూ వెరీ మచ్ రామ్మోహన్ నాయుడు: గంటా శ్రీనివాసరావు

- ఇటీవల విశాఖ నుంచి విమాన సర్వీసులపై గంటా అసంతృప్తి
- అమరావతి వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యలు
- నెల రోజుల్లోపు విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామన్న కేంద్రమంత్రి రామ్మోహన్
- రామ్మోహన్ ప్రకటనపై గంటా హర్షం
ఇటీవల విశాఖ నుంచి విజయవాడకు మార్నింగ్ ఫ్లయిట్స్ రద్దు చేయడం వల్ల... విశాఖ నుంచి అమరావతి రావాలంటే హైదరాబాద్ మీదుగా తిరిగి రావాల్సి వస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ... విశాఖ నుంచి కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిపోయిన అన్ని దేశీయ, విదేశీ విమాన సర్వీసులను నెల రోజుల్లోపు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలోని ప్రతి విమానాశ్రయానికి కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజాగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన పట్ల గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. థాంక్యూ వెరీ మచ్ రామ్మోహన్ నాయుడు... అంటూ కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక కారణాలతో విశాఖ నుంచి ఆగిపోయిన అన్ని దేశీయ, విదేశీ విమానాలను నెలరోజుల్లోపు పునరుద్ధరిస్తామని, దీనిపై విమాన నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్న మీ ప్రకటన విశాఖ విమాన ప్రయాణికుల్లో ఆనందం నింపిందని గంటా తెలిపారు.
మీ చొరవతో ఐటీ, టూరిజం, ఫార్మా తదితర కీలక రంగాల్లో వ్యాపార కార్యకలాపాలకు ఊతమిచ్చేలా భవిష్యత్ లో ఎయిర్ కనెక్టివిటీ పెరగాలని, కొత్త సర్వీసులు ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాం అని గంటా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.