67 ఏళ్ల పోసానిని వేధించేందుకే ఆ జైలుకు, ఈ జైలుకు తిప్పుతున్నారు: అంబటి రాంబాబు

Ambati Rambabu talks about Posani issue
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు జైలు నుంచి తరలిస్తుండడం పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. మూడ్రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పోసానికి 67 ఏళ్ల వయసు అని, ఆయన ఈ వయసులో ఆ జైలుకు, ఈ జైలుకు తిప్పడం వేధించడమేనని విమర్శించారు. 

"పోసానిని రైల్వే కోడూరు నుంచి నరసరావుపేట తీసుకువచ్చారు. నరసరావుపేట నుంచి గుంటూరు సబ్ జైలుకు తరలించారు. మళ్లీ ఇవాళ ఆదోని అంటున్నారు... అదొక 400 కిలోమీటర్లు ఉంటుంది. 67 ఏళ్ల పోసాని పట్ల ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గం. 

గత రాత్రే ఆయనను తీసుకువచ్చారు... ఇప్పుడు మళ్లీ తీసుకెళుతున్నారు. అది కూడా పోలీస్ జీప్ లో తీసుకెళుతున్నారు... పోలీస్ జీప్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వేధింపులకు గురిచేసేందుకు ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. 

పోసానిపై ఒకే అంశం మీద 16 కేసులు పెట్టారని తెలుస్తోంది... ఈ విషయాన్ని పరిశీలిస్తాం. పోలీస్ వ్యవస్థ, నారా లోకేశ్ కలిసి ఉద్దేశపూర్వకంగా పాల్పడుతున్న కుట్ర ఇది. 

ఆయనేమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? మీడియాలో మాట్లాడినందుకు 16 కేసులు పెట్టారు. ఓ రెండు మూడు నెలలు ఆయనను ఇలా కేసుల పేరిట తిప్పాలన్న దురుద్దేశంతో కుట్రపూరితంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాకపోతే ఇంకేమిటి? వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్లందరినీ భయపెట్టాలనుకుంటున్నారు. దీనిపై మేం న్యాయపోరాటం చేస్తాం" అంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Posani Krishna Murali
Ambati Rambabu
YSRCP

More Telugu News