Atchannaidu: ఎవరు వద్దన్నా చంద్రబాబు తర్వాత నారా లోకేశే నాయకుడు: అచ్చెన్నాయుడు

Nara Lokesh is next leader after Chandrababu says Atchannaidu
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం అంశంపై నిర్ణయం ఎవరూ వ్యక్తిగతంగా తీసుకునేది కాదని చెప్పారు. పదవులైనా, ఎలాంటి నిర్ణయాలైనా కూటమిలోని మూడు పార్టీల పెద్దలు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారని... ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని అన్నారు. 

విశాఖలో ఈరోజు లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా అచ్చెన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి లోకేశ్ వచ్చారని అచ్చెన్నాయుడు కితాబిచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేశ్ చరిత్ర సృష్టించారని, 27 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారని, ప్రతి కరెంట్ స్తంభానికి లైట్లు ఏర్పాటు చేసి వెలుగులు నింపారని, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందించారని ప్రశంసించారు. ఎవరు వద్దన్నా, కాదన్నా టీడీపీకి చంద్రబాబు తర్వాత నాయకుడు నారా లోకేశేనని అన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఉండకూడదని కక్ష కట్టి వ్యవహరించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తమలాంటి వాళ్లు కూడా ఎంతో ఇబ్బంది పడ్డామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. ఏపీ కోల్పోయిన నమ్మకాన్ని ఏడు నెలల కూటమి పాలనలో తిరిగి తీసుకొచ్చామని తెలిపారు. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
Go Back to Shorts
Atchannaidu
Nara Lokesh
Telugudesam

More Telugu News