‘వెరీ సారీ’.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దక్షిణ కొరియా అధ్యక్షుడు
- విపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ ఎమర్జెన్సీ మార్షల్ లా విధింపు
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
- అధ్యక్షుడు యూన్ సక్ యోల్పై నేడు అభిశంసన తీర్మానం
- 200 ఓట్లు అనుకూలంగా వస్తే సరి.. లేదంటే పదవీ గండం
- మార్షల్ లా విధించి ప్రజలను అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమించాలని అధ్యక్షుడి వేడుకోలు
నేటి సాయంత్రం సమావేశం కానున్న పార్లమెంట్ అభిశంసన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనుంది. 300 మంది సభ్యులున్న పార్లమెంట్లో కనీసం 200 మంది యోల్కు అనుకూలంగా ఓటు వేస్తేనే ఆయన పదవి చెక్కుచెదరకుండా ఉంటుంది. లేదంటే పదవీచ్యుడు కాక తప్పదు. ప్రస్తుతం దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ, ఇతర చిన్న విపక్ష పార్టీల బలం మొత్తంగా 192గా ఉంది. వీరంతా మూకుమ్మడిగా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే ఆయన పదవి నుంచి వైదొలగక తప్పదు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇటీవల తీసుకొచ్చిన తీర్మానం 190-0తో నెగ్గడంతో అధ్యక్షుడి మెడపై కత్తి వేలాడుతున్నట్టే.
అభిశంసన తీర్మానం నేపథ్యంలో యోల్ తాజాగా స్పందించారు. ఎమర్జెన్సీ మార్షల్ లా విషయంలో క్షమాపణలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఆ ప్రకటన కోసం తన రాజకీయ, చట్టపరమైన బాధ్యతలను తప్పించుకోలేనన్నారు. మార్షల్ లాతో ప్రజలను ఆందోళనకు, అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నానని, మరోమారు ఇలా చేయబోనని హామీ ఇచ్చారు.