ఇక మీ ఇష్టం.. చాంపియన్స్ ట్రోఫీపై పాకిస్థాన్కు తేల్చి చెప్పేసిన ఐసీసీ
- హైబ్రిడ్ మోడల్కు పాక్ అంగీకరించాల్సిందేనన్న ఐసీసీ
- లేదంటే ట్రోఫీ నిర్వహణ విషయాన్ని మర్చిపోవాలని సూచన
- భారత జట్టు ఆడకుంటే బ్రాడ్కాస్టర్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వరన్న ఐసీసీ వర్గాలు
- హైబ్రిడ్ మోడల్కు పాక్ అంగీకరించకుంటే ఆ జట్టు లేకుండానే ట్రోఫీ జరుగుతుందని తేల్చేసిన ఐసీసీ
ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఐసీసీ సమావేశంలో పీసీబీ మరోమారు అదే మొండివైఖరి ప్రదర్శించింది. దీంతో ఐసీసీ తీవ్రంగా స్పందించింది. హైబ్రిడ్ మోడల్ను అంగీకరిస్తే సరేనని, లేదంటే ట్రోఫీ నిర్వహణ నుంచి పక్కకు తప్పుకోవాలని తేల్చి చెప్పేసింది. ఐసీసీ బోర్డు సభ్యుల్లో చాలామంది పాకిస్థాన్ పట్ల సానుభూతితో వ్యవహరించారు. ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ ఒక్కటే ఆమోదయోగ్యమైన పరిష్కారమని పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీకి సూచిస్తూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
హైబ్రిడ్ మోడల్కు పాక్ అంగీకరిస్తే యూఏఈలో భారత్-పాక్ మ్యాచ్లు జరుగుతాయి. లేదంటే లేనట్టే. ఐసీసీ ఈవెంట్లో భారత్ ఆడకుంటే బ్రాడ్కాస్టర్లు రూపాయి కూడా ఇవ్వరని, ఈ విషయం పాకిస్థాన్కు కూడా తెలుసని ఐసీసీ బోర్డు వర్గాలు తెలిపాయి. హైబ్రిడ్ మోడల్కు నక్వీ అంగీకరిస్తే శనివారం (నేడు) సమావేశం జరుగుతుందని పేర్కొన్నాయి. ఒకవేళ పాక్ ఇందుకు అంగీకరించకుంటే వేరే దేశానికి (బహుశా యూఏఈకి) తరలించే అవకాశం ఉందని, అప్పుడా టోర్నీ పాక్ లేకుండానే జరుగుతుందని ఆ వర్గాలు తేల్చి చెప్పాయి.