పాక్ క్రికెట్ బోర్డుకు అఫ్రిది మద్దతు... బీసీసీఐపై ఆగ్రహం

Pak former cricketer Shahid Afridi slams BCCI over its stands on Champions trophy
  • ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలన్న ప్రతిపాదనకు పీసీబీ నిరాకరణ
  • మొత్తం టోర్నీని పాక్ గడ్డపైనే నిర్వహించాని పట్టు
  • నేటి సమావేశం తర్వాత ఓ నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ
  • క్రీడలు, రాజకీయాలను ఒక గాటన కట్టడమేంటని బీసీసీఐపై అఫ్రిది ఫైర్
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పీసీబీకి పూర్తి మద్దతు ప్రకటించాడు. ప్రతిపాదిత హైబ్రిడ్ మోడల్‌ను నిరాకరించిన పాక్ బోర్డుకు అండగా నిలిచిన అఫ్రిది బీసీసీఐపై విమర్శలు కురిపించాడు. రాజకీయాలు, క్రీడలను ఒకే గాటన కట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ఐసీసీకి సూచించాడు. నేటి సమావేశంతో తర్వాత చాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకోనుంది. 

మరోవైపు, ట్రోఫీకి భారత జట్టును పాకిస్థాన్‌కు పంపే ప్రశ్నే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైబ్రిడ్ మోడల్‌కు నిరాకరిస్తున్న పీసీబీ టోర్నీ మొత్తాన్ని పాక్ గడ్డపైనే నిర్వహించాలని పట్టుబడుతోంది. 

ముంబై ఉగ్రదాడుల తర్వాత పాక్ జట్టు భారత్‌లో ఐదుసార్లు పర్యటించిన విషయాన్ని అఫ్రిది ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక వైట్ బాల్ సిరీస్ జరిగినట్టు కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఐసీసీ, దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నాడు. 
Go Back to Shorts
Shahid Afridi
PCB
Team Pakistan
Champions Trophy 2025
BCCI
ICC

More Telugu News