వేములవాడలో బండి సంజయ్పై తీవ్రస్థాయిలో మండిపడిన రేవంత్ రెడ్డి
- రెండుసార్లు గెలిపిస్తే సంజయ్ చేసిందేమీ లేదని విమర్శ
- కేసీఆర్ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానన్న సీఎం
- కేసీఆర్ వేములవాడ రాజన్నను కూడా మోసం చేశారని ఆగ్రహం
వేములవాడ గుడిచెరువులో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానన్నారు. కేసీఆర్ ప్రజలనే కాదు... వేములవాడ రాజన్ననూ మోసం చేశాడని మండిపడ్డారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 30న మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడకు వచ్చి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
దేశానికి పీవీ నర్సింహారావు వంటి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అన్నారు. పరిపాలన అంటే ఎలా ఉంటుందో ఆయన చూపించారన్నారు. తెలంగాణను ఇస్తామని సోనియా గాంధీ కరీంనగర్ గడ్డ నుంచే ప్రకటన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింప చేయడంలో కరీంనగర్ బిడ్డ జైపాల్ రెడ్డి కీలక పాత్ర వహించారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నెరవేరుస్తుందని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ను కరీంనగర్ నుంచి గెలిపిస్తే తెలంగాణ సాధించారని కితాబునిచ్చారు.