Revanth Reddy: హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy participates in protest against Adani at ED office in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 

కేంద్ర సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా అదానీకి లబ్ధి చేకూరుస్తున్నారని, దీనిని నిరసిస్తూ దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు ఆందళనలు నిర్వహించింది.

ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారన్నారు. 

భారత్‌కు రూ.183 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, ఇందులో 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే ప్రస్తుత ప్రధాని మోదీ రెండింతలు అప్పుచేశారని విమర్శించారు. తన పరివారాన్ని కాపాడుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దేశాన్ని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్ పర్సన్ అక్రమాల పైనా జేపీసీ వేయాలన్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉందన్నారు. కాగా, ఈ ఆందోళనలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సత్యం విజయం సాధిస్తుందని ప్లకార్డును ప్రదర్శించారు.

అదానీ ఆస్తులపై ఈడీకి ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ధర్నా అనంతరం అదానీ ఆస్తుల వ్యవహారంపై ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదానీ కుంభకోణంపై విచారణ జరపాలని వినతిపత్రం ఇచ్చారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
ED
Hyderabad

More Telugu News