Mallikarjun Kharge: మోదీ ఫ్రస్ట్రేషన్‌లో ముస్లింలు, మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారు: మల్లికార్జున ఖర్గే

Poor Have More Children Why Only Talk About Muslims Mallikarjun Kharge To PM Modi
  • కాంగ్రెస్‌ మెజారిటీవైపు దూసుకుపోతుండటంతో మోదీ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారన్న కాంగ్రెస్ అధ్యక్షుడు
  • అందుకే, మోదీ మంగళసూత్రాలు, ముస్లింల గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్య
  • పేదరికం కారణంగా అధిక సంతానం కలుగుతుందన్న ఖర్గే
  • మరి మోదీ ప్రత్యేకంగా ముస్లింల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్న
పేద కుటుంబాల్లో సాధారణంగా సంతానం ఎక్కువగా ఉంటుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మోదీ ప్రత్యేకంగా ముస్లింల గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పైచేయి సాధిస్తుండటం చూసి మోదీ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని కామెంట్ చేశారు. అందుకే ఆయన మంగళసూత్రాలు, ముస్లింల గురించి మాట్లాడటం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఝార్ఖండ్‌లో జాంజ్గిర్-చంపా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శివకుమార్ దహారియా తరపున మంగళవారం ఆయన ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే బీజేపీపై విమర్శలు గుప్పించారు. పేదల హక్కులు కాలరాసేందుకే బీజేపీ 400 సీట్లు కోరుకుంటోందని చెప్పారు. ‘‘మేము మెజారిటీ దిశగా దూసుకెళుతున్నాం. అందుకే మోదీ మంగళసూత్రాలు, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. మేము మీ డబ్బంతా తీసుకుని పేదలకు ఇచ్చేస్తామని మోదీ అంటున్నారు. పేద కుటుంబాల్లో ఎప్పుడూ సంతానం ఎక్కువే. మరి మోదీ ముస్లింల గురించే ఎందుకు మాట్లాడతారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
 
‘‘పేదలకు డబ్బు లేకపోవడంతో అధిక సంతానానికి దారి తీస్తుంది. కానీ మోదీ మాత్రం ముస్లింల గురించే మాట్లాడుతున్నారు. ముస్లింలు కూడా ఈ దేశానికి చెందిన వారే. మోదీ ప్రకటనలతో తప్పుదారి పట్టొద్దు. అందరినీ కలుపుకుని వెళితేనే దేశాన్ని అభివృద్ధి చేయగలం’’ అని ఖర్గే పేర్కొన్నారు.  

తనకు ఐదుగురు సంతానమని చెప్పిన మల్లికార్జున ఖర్గే తన తండ్రికి తానొక్కడినే సంతానమని చెప్పుకొచ్చాడు. గతంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో తన తల్లి, చెల్లి, మరో బంధువు చనిపోయారని చెప్పారు. మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే దేశం సర్వనాశనం అవుతుందని చెప్పారు.

More Telugu News

Mallikarjun Kharge
Narendra Modi
Congress
BJP
Chhattisgarh