మణిపూర్ అల్లర్లలో మహిళలపై అత్యాచారానికి పోలీసులూ కారణమే.. చార్జిషీట్లో పేర్కొన్న సీబీఐ
- గతేడాది మే 4న మణిపూర్లో కుకీ-మెయితీల మధ్య ఘర్షణలు
- తమపై దాడి చేస్తున్న గుంపు నుంచి కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన ఇద్దరు మహిళలు
- బాధిత మహిళలను తీసుకెళ్లి గుంపు ముందు దిగబెట్టిన పోలీసులు
- అనంతరం, ఇద్దరు మహిళలను నిందితులు నగ్నంగా ఊరేగించి ఆపై అత్యాచారం
- గుంపు దృష్టి ఆ ఇద్దరిపై మళ్లినప్పుడు తప్పించుకున్న మూడో మహిళ
- చార్జిషీటులో సీబీఐ ఆరోపణలు
చార్జిషీట్ వివరాల ప్రకారం, తమ గ్రామంపై జనాలు పలు బృందాలుగా విడిపోయి దాడి చేయడం ప్రారంభించగానే ముగ్గురు మహిళలు తమ కుటుంబాలతో కలిసి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. కానీ, గ్రామంపై దాడి చేస్తున్న మూక వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చింది. ఈలోపు గుంపులోని కొందరు బాధితులకు పోలీసులను ఆశ్రయించమని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు మరో పురుషుడు సమీపంలోని పోలీసు జీపు వద్దకు వెళ్లి అందులోని ఇద్దరు పోలీసుల సాయం అర్థించారు. కానీ, పోలీసులు వారిని తీసుకెళ్లి దాడిచేస్తున్న గుంపు ముందు దిగబెట్టారు. ఈ క్రమంలో ఆ దుండగులు ఇద్దరు మహిళలతో పాటు ఉన్న పురుషుడిని చంపేశారు. దుండగుల దృష్టి ఇద్దరు మహిళపై ఉండగా మరో మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. మరోవైపు, తమకు చిక్కిన ఇద్దరు మహిళలను.. దుండగులు నగ్నంగా ఊరేగించి చివరకు గ్యాంగ్ రేప్ చేశారు.
ఈ దాడి మొత్తం ముందస్తు ప్రణాళికతో చేసిందని సీబీఐ పేర్కొంది. ఓ మైనర్ సహా మొత్తం ఏడుగురిపై కేసు ఫైల్ చేసింది. వీరు.. మరో భారీ గుంపుతో కలిసి ఈ దాడి చేశారని వెల్లడించింది. నిందితులపై గ్యాంగ్ రేప్, హత్య, మహిళలను అగౌరవపరచడం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు సీబీఐ తన చార్జి షీటులో పేర్కొంది.