Advertisement

గోషామహల్‌లో బీఆర్ఎస్‌ను గెలిపించి డబుల్ ఇంజిన్ తెలంగాణ సర్కార్ చేయండి: ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి

KTR campaign in Goshamahal
  • రాజాసింగ్ తాను హిందువునంటూ రాజకీయం చేస్తాడు.. కేసీఆర్ అంతకంటే పెద్ద హిందువు అన్న కేటీఆర్
  • గోషామహల్‌ను గచ్చిబౌలి తరహా తీర్చిదిద్దుతామని హామీ
  • మార్వాడీలు ఒక్కసారి మీ సామాజిక వర్గానికి చెందిన బిలాల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి
రాజాసింగ్ తాను హిందువునంటూ రాజకీయం చేస్తాడని, కానీ కేసీఆర్ అంతకంటే పెద్ద హిందువు అని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ బిలాల్‌ను గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. గోషామహల్‌ను గచ్చిబౌలి తరహా తీర్చిదిద్దుతానన్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడన్నారు. గోషా మహల్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. గండిపేటకు గోదావరి జలాలు తీసుకువచ్చి మూసీ నది గుండా పారిస్తామన్నారు.

మార్వాడీలు ఒక్కసారి మీ సామాజిక వర్గానికి చెందిన బిలాల్‌ను గెలిపించుకోవాలని కోరారు. ఇదివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తమకు ఇవ్వండని కోరారు. నందకిషోర్ పాతికేళ్లుగా ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, కరోనా సమయంలో ఎంతోమందికి సేవలు అందించారన్నారు. తెలంగాణలో మూడోసారి తమ ప్రభుత్వం రాగానే హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్నారు. కోహ్లీ సెంచరీ కొట్టినట్లు బీఆర్ఎస్ సెంచరీ కొట్టాలంటే ఇక్కడి నుంచి నందకిషోర్‌ను గెలిపించాలన్నారు. మోదీ, అమిత్ షాలు చెప్పినట్లు గోషామహల్‌లో బీఆర్ఎస్‌ను గెలిపించి డబుల్ ఇంజిన్ తెలంగాణ సర్కార్ చేయాలన్నారు.
Advertisement
KTR
Raja Singh
goshamahal
Telangana Assembly Election

More Telugu News