ముఖ్యమంత్రి పదవిపై ముదినేపల్లిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
- ముదినేపల్లిలో వారాహి విజయ యాత్ర సభ
- ఉత్తేజపూరితంగా ప్రసంగించిన పవన్
- సీఎం పదవి వస్తే బలంగా పనిచేస్తానని వెల్లడి
- లేకపోతే బాధ్యతగా పనిచేస్తానని వివరణ
- జగన్ ను పంపించే సమయం వచ్చేసిందన్న జనసేనాని
జగన్ ను పంపించే సమయం వచ్చేసిందని, ఇక జగన్ కు టాటా చెప్పేద్దాం అని పిలుపునిచ్చారు. సీఎం పదవి వస్తే బలంగా పనిచేస్తానని, లేకపోతే బాధ్యతగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. ఏదేమైనా ప్రజల కోసం నిలబడడం పక్కా అని పేర్కొన్నారు.
రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, స్కూళ్లు మూతపడిపోతున్నాయని, వలసలు పెరుగుతున్నాయని అన్నారు. అందుకే తన ప్రాణం పోయేంత వరకు రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. అందరం కలిసి వెళతామనే అనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.
ఇక, తానేమీ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకం కాదని, ఇంకో రూ.10 వేలు ఎక్కువ ఇవ్వాలని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకునే వ్యక్తినని వివరించారు. జగన్... సంక్షేమ పథకాలకు ఇచ్చేది మీ డబ్బే... ఆయన తన జేబు నుంచి ఇవ్వడంలేదని అన్నారు. సంపద సృష్టించకుండా కేవలం పథకాలు మాత్రమే ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.