పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం

  • మృతదేహాలతో శ్మశానానికి వెళ్తుండగా ఘటన
  • తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు
  • దట్టంగా కురుస్తున్న మంచు, అతి వేగమే ప్రమాదానికి కారణం
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మందికిపైగా వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలతో నవద్వీప్ శ్మశాన వాటికవైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రక్కును మెటాడోర్ అత్యంత బలంగా ఢీకొంది. ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అతివేగంతోపాటు దట్టంగా కురుస్తున్న మంచే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

West Bengal
Road Accident
Nadia

More Telugu News