అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Develop Anakapalle as Another Rangareddy District
  • రాంబిల్లిలో రూ.5,400 కోట్లతో రెన్యూ సోలార్ ప్లాంట్‌కు శంకుస్థాపన
  • రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యమని వెల్లడి
  • గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైందని విమర్శ
  • విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గతంలో వెనుకబడిన రంగారెడ్డి జిల్లా ఎలాగైతే సంపన్న ప్రాంతంగా మారిందో, విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లిని కూడా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ సోలార్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 6.5 గిగావాట్ల ఇన్‌గాట్-వేఫర్ తయారీ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధిపై తన ప్రభుత్వ దార్శనికతను ఆవిష్కరించారు.

పెట్టుబడులతో పునర్నిర్మాణం
గత ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించాలన్న ఏకైక లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేస్తూ, ఇప్పుడు రెన్యూ ఎనర్జీ సంస్థ భారీ పెట్టుబడితో ముందుకు రావడం శుభపరిణామమన్నారు. 

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా వేగంగా అభివృద్ధి చెందుతున్న సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడం రాష్ట్రంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, రాంబిల్లిలో సోలార్ ఫలకాల తయారీ పరిశ్రమ రావడం ద్వారా రాష్ట్రం విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.

గ్రీన్ ఎనర్జీయే లక్ష్యం
రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే ఈ రంగంలో రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. 90 గిగావాట్ల మేర ప్రతిపాదనలు, ఒప్పందాలు (ఎంఓయూలు) సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒక్క ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సంస్థే రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తోందన్నారు. 

అభివృద్ధికి విద్యుత్ వినియోగం ఒక సూచిక అని, అందుకే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వివరించారు. దీనిలో భాగంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, ఆర్టీసీ కూడా 1,050 గ్రీన్ బస్సులను ప్రవేశపెడుతోందని, రాష్ట్రవ్యాప్తంగా 5,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని చంద్రబాబు ఆరోపించారు. 2019-24 మధ్య కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలు) రద్దు చేయడం, నిర్వహణా లోపంతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వంటి చర్యలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. 

పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని మోపి 'ట్రూ ఆప్' ఛార్జీల రూపంలో వసూలు చేశారని విమర్శించారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తమ ప్రభుత్వం ప్రారంభించిన విద్యుత్ సంస్కరణల ఫలాలను ప్రజలకు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Anakapalle
Andhra Pradesh
Renew Solar
Green Energy
Investments
Solar Power
Yashwant Sinha
Jayant Sinha
Electric Vehicles

More Telugu News