Chandrababu: గాంధీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా?: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Chandrababu Fires On AP CM Jagan
షార్ట్స్‌లో చూడండి
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరికీ అందుబాటులోకి మద్యం తీసుకొచ్చి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా? అని ప్రశ్నించారు. వచ్చే 15 ఏళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి మరీ అప్పులు తెస్తున్నారని, మద్యాన్ని ఏరులై పారిస్తూ కుటుంబాలను రోడ్డుకీడుస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజలకు గాలిమాటలు చెబుతూ మద్యం ఆదాయాన్ని 75 శాతం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో బెల్టు షాపులను రద్దు చేస్తే జగన్ వచ్చాక ప్రతి వీధిలోనూ బెల్టుషాపులు తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రతి ఊరిలోనూ సారాబట్టీలు తెచ్చారని దుమ్మెత్తి పోశారు. ఒక్క ఏడాదిలోనే 1.25 కోట్ల లీటర్ల సారా పట్టుబడిందని, ఈ లెక్కన దొరకనిదెంతో అర్థం చేసుకోవాలని అన్నారు. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నారని అన్నారు. దేశంలో మాదక ద్రవ్యాలు ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయని ఆరోపించారు. అక్రమార్జన కోసం డ్రగ్స్ మాఫియాతో చేతులు కలపడం వల్ల రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, హింసకు అదుపు లేకుండా పోయిందన్నారు.

కాగా, మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నిన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో వారి చిత్రపటాలకు చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో నైతికతే గాంధీ ఆశయమని, కులాలు, మతాలుగా విడిపోని సంపూర్ణ సమైక్య జాతి నిర్మాణాన్ని ఆయన ఆశించారని గుర్తు చేశారు. ప్రజల్లో చైతన్యం వస్తేనే నిజాయతీతో కూడిన రాజకీయాలు సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
YS Jagan
Liquor
Mahatma Gandhi
Andhra Pradesh
TDP

More Telugu News