Corona Virus: హైదరాబాద్‌లో సగం మందికి తెలియకుండానే వచ్చి పోయిన కరోనా.. 54 శాతం మందిలో యాంటీబాడీలు!

Half of the Hyderabadis dont know that they got corona virus infection
  • 75 శాతం మందికి కరోనా వచ్చి పోయిన విషయం తెలియదు
  • కరోనా నుంచి కోలుకున్న వారికి రీఇన్‌ఫెక్షన్ లేదు
  • 80 శాతం మందిలో వైరస్‌ను తట్టుకునే సామర్థ్యం
హైదరాబాద్‌లో సగం మందికిపైగా కరోనా వైరస్ వచ్చి పోయిందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది. వీరిలో 75 శాతం మందికి తమకు కరోనా వచ్చి పోయిందన్న విషయం కూడా తెలియదని పేర్కొంది. కరోనా సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడమే ఇందుకు కారణమని తేలింది.

 అలాగే, హైదరాబాద్ జనాభాలో 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు గుర్తించామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వివరించారు. సీసీఎంబీ, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), భారత్ బయోటెక్ సంస్థలు హైదరాబాద్ పరిధిలో సంయుక్తంగా నిర్వహించిన సీరో అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ వైరస్ ఇంకా మన చుట్టూనే ఉందని, నిర్లక్ష్యం చేస్తే లెక్కలు మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో రీఇన్‌ఫెక్షన్ లేదని మిశ్రా పేర్కొన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ కరోనా విస్తృతి, తీవ్రత రెండూ కొంత తక్కువగానే ఉన్నట్టు చెప్పారు. కరోనాను తట్టుకునే సామర్థ్యం దాదాపు 80 శాతం మందిలో ఉందని, టీకాలతో యాంటీబాడీల శాతం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని డాక్టర్ మిశ్రా పేర్కొన్నారు.

More Telugu News

Corona Virus
Hyderabad
CCMB
NIN
Bharat Biotech