ఆఖరి ప్రయాణం...రైలు పై బెర్త్‌ నుంచి జారిపడి మహిళ మృతి

  • ముంబై నుంచి బెంగళూరుకు వస్తుండగా ఘటన
  • బెంగళూరు సంగోళిరాయన్న స్టేషన్‌లో ప్రమాదం
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
రైలులో ముంబై నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఓ మహిళ పైబెర్త్‌ నుంచి జారిపడి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన విషాద సంఘటన ఇది. ప్రయాణికులు ట్విట్టర్‌లో ఉంచిన సమాచారం మేరకు ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి.

 కోల్‌కతాకు చెందిన సరస్వతీ బనియల్‌ బెంగళూరులోని ఓ బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్నారు. నైపుణ్యాల అభివృద్ధికి ముంబై వెళ్లిన ఆమె రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. రైలు బెంగళూరులోని సంగోళీ రాయన్న రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో పై బెర్త్‌లో ఉన్న ఆమె కిందికి దిగేందుకు చేసిన ప్రయత్నంలో జారిపడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితిపై తోటి ప్రయాణికులు రైల్వే ట్విట్టర్‌లో సమాచారాన్ని ఉంచారు.

తర్వాత స్టేషన్‌లో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండి రైలు ఆగగానే సరస్వతీ బనియల్‌కు ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమిస్తుండడంతో అక్కడి నుంచి అంబులెన్స్‌లో కేసీ జనరల్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అసుపత్రికి చేరుకున్నాక సరస్వతీ బనియల్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్టు ధ్రువీకరించారు.

స్టేషన్‌ నుంచి సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నప్పుడు బాధితురాలు పోలీసులు, వైద్య సిబ్బందితో మాట్లాడారని, తన లగేజీ జాగ్రత్తగా ఉంచాలని కూడా సూచించారని పోలీసులు తెలిపారు. మెదడుకుగాని, వెన్నుపూసకుగాని తీవ్రమైన దెబ్బతగడం వల్లే ఆమె మృతి చెంది ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.
Go Back to Shorts
train travel
upper bearth
lady fallen and died
bengalur

More Telugu News