విజయసాయిరెడ్డి తమ పార్టీ ఆఫీసులోకి వెళ్లినట్టుగానే ఈసీ ఆఫీసులోకి వెళ్తున్నారు: ఎంపీ కనకమేడల

  • విజయసాయి కోరినప్పుడల్లా అపాయింట్‌మెంట్
  • 150 ఫిర్యాదులు ఇచ్చినా స్పందించట్లేదు
  • ఏపీ ప్రజల్లో ఈసీపై సదభిప్రాయం లేదు
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తమ పార్టీ ఆఫీసులోకి వెళ్లినట్టుగానే ఈసీ ఆఫీసులోకి వెళుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. నేడు ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఏపీలో అధికారుల బదిలీపై సీఎం చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. గతంలో టీడీపీ చేసిన ఫిర్యాదులను సైతం పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కనకమేడల కోరారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక అకారణంగా, ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేశారన్నారు. విజయసాయి కోరినప్పుడల్లా అపాయింట్‌మెంట్ ఇస్తున్న ఈసీ తమకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల సంఘం ఏపీలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తాము దాదాపు 150 ఫిర్యాదులు ఇచ్చినా స్పందించలేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల్లో ఈసీపై సదభిప్రాయం లేదని, అవసరమైతే ఈసీపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
Go Back to Shorts
Kanakamedala Ravindra kumar
Vijayasai Reddy
Telugudesam
Election Commission
Srikakulam
Kadapa

More Telugu News