తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అరెస్ట్
- తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
- డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న కార్మికులు
- నిబంధనల ప్రకారమే సమ్మెకు దిగామన్న ఈదురు వెంకన్న
తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజూ ఉద్ధృతంగా కొనసాగుతోంది. తెలంగాణలోని దాదాపు అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో డిపోల వద్ద ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్నతో పాటు పలువురు కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
జనగామ డిపో వద్ద టెంట్లు తొలగించడంతో కార్మికులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు బస్సులు నిలిచిపోవడంతో సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.