‘సప్తధార’.. భారత్‌ అభివృద్ధికి మోదీ మాస్టర్‌ప్లాన్‌ ఇదే!

Saptadhara Modi master plan for India development
  • తయారీ రంగాన్ని ప్రపంచ సరఫరా కేంద్రంగా మార్చాలని పిలుపు
  • రైతుల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లాలని సూచన
  • సాంకేతికత, 6జీ రంగాల్లో భారత్‌ ముందుండాలని ఆకాంక్ష
  • రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలతో దేశంలో గతిశక్తికి ఊతమివ్వాలని వెల్లడి
  • ఆత్మనిర్భర్‌ రక్షణ, డ్రోన్‌ సాంకేతికతపై దృష్టి పెట్టాలని సూచన
  • హరిత ఇంధనం, సాఫ్ట్‌ పవర్‌తో భారత్‌ ప్రభావాన్ని పెంచాలని పిలుపు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్‌ అభివృద్ధికి కీలకమైన ఏడు రంగాలను ‘శక్తి సప్తధార’గా అభివర్ణించారు. దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడు శక్తులను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. తయారీ రంగం, రైతులు, సాంకేతికత, గతిశక్తి, రక్షణశక్తి, హరిత ఇంధనం, సాఫ్ట్‌ పవర్‌ను భారత్‌ బలాలుగా పేర్కొన్నారు. ఈ రంగాల్లో వేగంగా ముందుకు సాగితే దేశ వృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని చెప్పారు.

1. తయారీ రంగం: భారత్‌ భవిష్యత్‌ వృద్ధికి తయారీ రంగమే కీలకమని మోదీ అన్నారు. విడిభాగాలతో పాటు పూర్తి ఉత్పత్తులను దేశంలోనే తయారు చేయాలని సూచించారు. నాణ్యత, తక్కువ ఖర్చు, భారీ ఉత్పత్తితో ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ కీలకంగా మారాలని పిలుపునిచ్చారు.

2. రైతులు: వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాలకు మరింత ఊతమివ్వాలని ప్రధాని చెప్పారు. భారత రైతులకు ప్రపంచ మార్కెట్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎగుమతులను పెంచాలని సూచించారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలను ప్రపంచ బ్రాండ్లుగా మార్చాలని అన్నారు.

3. సాంకేతికత: కొత్త సాంకేతికతలు, డేటా సెంటర్లు, రోబోటిక్స్‌లో భారత్‌ ప్రపంచ కేంద్రంగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. యూపీఐతో భారత సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. దేశంలో తయారైన 6జీ సాంకేతికతను దేశవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.

4. గతిశక్తి: దేశంలో రవాణా, అనుసంధాన వ్యవస్థలను మరింత వేగవంతం చేయాలని మోదీ అన్నారు. కొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మెరుగైన మౌలిక వసతులతో వ్యాపారాలకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.

5. రక్షణశక్తి: రక్షణ రంగంలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలోనే రక్షణ పరికరాల తయారీని పెంచాలని సూచించారు. డ్రోన్లు, డ్రోన్‌ నిరోధక సాంకేతికతలపై పెట్టుబడులు పెంచాలని అన్నారు.

6. హరిత ఇంధనం: హరిత ఇంధన రంగాన్ని భారత్‌ అభివృద్ధికి కీలక శక్తిగా మోదీ పేర్కొన్నారు. ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని సూచించారు. భవిష్యత్‌ ఇంధన అవసరాలను తీర్చేందుకు హరిత ఇంధనంపై దృష్టి పెట్టాలని అన్నారు.

7. సాఫ్ట్‌ పవర్‌: యోగా, హస్తకళలు, సినిమాలు, యానిమేషన్‌, గేమింగ్‌, డిజిటల్‌ కంటెంట్‌ భారత్‌ సాఫ్ట్‌ పవర్‌ను పెంచుతాయని మోదీ చెప్పారు. సృజనాత్మక రంగాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. పర్యాటక రంగంలోనూ భారత్‌కు ఉన్న అవకాశాలను మరింతగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Advertisement
Narendra Modi
Saptadhara
India Development Plan
Independence Day Speech
Atmanirbhar Bharat
Viksit Bharat

More Telugu News