మనం అడ్రస్ లేనివాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి: మంత్రి లోకేశ్‌

Nara Lokesh says we are not addressless and Amaravati is our care of address
  • విజయవాడలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌
  • ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని తమ విధానమని మరోసారి స్పష్టీకరణ
  • ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • కులమతాలకు అతీతంగా స్వర్ణాంధ్ర సాధన కోసం పనిచేద్దామని పిలుపు
 కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించుకుందామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. "ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. మనం అడ్రస్ లేని వాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి" అని ఆయన పునరుద్ఘాటించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం
విద్యా వ్యవస్థలో తాము చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రి లోకేశ్‌ వివరించారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని గర్వంగా ప్రకటించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్టూడెంట్ కిట్లు, డొక్కా సీతమ్మ గారి పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేకుండా చేశామని, పాఠ్యపుస్తకాలపై కానీ, పాఠశాలల వద్ద కానీ ఎక్కడా ముఖ్యమంత్రి లేదా తన ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు. చరిత్రలో తొలిసారిగా, పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలతో ప్రకటనలు ఇచ్చామని గుర్తుచేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించినట్లు వెల్లడించారు.

మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం
లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని లోకేశ్‌ అన్నారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను ఎగురవేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తన తాత, స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద ఉన్న జిల్లాలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం అరుదైన గౌరవమని తన వ్యక్తిగత ఆనందాన్ని పంచుకున్నారు. విజయవాడ నగరం విద్య, కళలకు నిజమైన రాజధాని అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Amaravati Capital
Andhra Pradesh Education Reforms
Swarnandhra 2047 Vision
Vijayawada Independence Day
Government Schools AP

More Telugu News