పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

Pawan Kalyan Orders Alert on Tiger Movement in Polavaram
  • పులి దాడిలో 9 దూడలు మృతి చెందడంపై అధికారుల అప్రమత్తం
  • పులిని బంధించాలని అటవీ శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశం
  • అధునాతన టెక్నాలజీతో 24 గంటల పర్యవేక్షణకు ఏర్పాట్లు
  • నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని సూచన
పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు, పశువుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పులి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల పోలవరం జిల్లాలోని చికిలింత పంచాయతీలో పులి దాడి చేసి 9 దూడలను చంపిన ఘటనపై పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పులి తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌‌లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీనిపై సమీక్ష నిర్వహించిన ఆయన, పులి వల్ల మనుషులకు, పశువులకు ఎలాంటి హాని జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డ్రోన్లు, ట్రాప్ కెమెరాల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పవన్ సూచించారు. 24 గంటల పాటు నిఘా కోసం ప్రత్యేక 'హనుమాన్' బృందాలను రంగంలోకి దించాలని, అవసరమైతే వాటి సంఖ్యను పెంచాలని అన్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) స్థాయి అధికారి ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

అదే సమయంలో, పశువులను కోల్పోయిన రైతులకు తక్షణమే మధ్యంతర పరిహారం అందించినట్లు, పూర్తి నష్టపరిహారాన్ని త్వరలో చెల్లిస్తామని అధికారులు పవన్‌కు వివరించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని కూడా ఆయన ఆదేశించారు.
 
Go Back to Shorts
Pawan Kalyan
Polavaram
Tiger
Andhra Pradesh
Forest Department
Wildlife
Animal Attack
Drones
Trap Cameras
Timmapuram Reserve Forest

More Telugu News