ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం

AP Government Bans Borewells in 258 Villages to Conserve Groundwater
  • ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం
  • భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ నిర్ణయం 
  • తాగునీటి అవసరాల కోసం చేతి బోర్లకు మాత్రం మినహాయింపు
  • ఖరీఫ్ సాగును ముందుగానే చేపట్టాలని రైతులకు వ్యవసాయశాఖ సూచన
ఏపీ ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటిన 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్తగా బోర్ల తవ్వకాలను పూర్తిగా నిషేధించింది. అయితే, ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే చేతి బోర్లకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. ఈ గ్రామాల్లో వ్యవసాయ, వాణిజ్య అవసరాలకు కొత్త బోర్లు వేయడంతో పాటు ఇసుక తవ్వకాలపై కూడా నిషేధం విధిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీకాకుళంలో 76, ప్రకాశంలో 91, పల్నాడులో 20, చిత్తూరులో 8, అనంతపురం జిల్లాలో 14, శ్రీసత్యసాయి జిల్లాలో 39, కడప జిల్లాలో 10 గ్రామాల్లో నీటి వినియోగం పరిమితికి మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు రైతులను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమైంది. ఈ ఏడాది ప్రాజెక్టుల నుంచి నీటిని ముందుగా విడుదల చేస్తుండటంతో, ఖరీఫ్ సాగును కూడా ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్‌ జిలానీ రైతులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ముందస్తు సాగు వల్ల పంట కోత సమయానికి ప్రకృతి వైపరీత్యాల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆయన రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి రైతు 'ఫార్మర్స్‌ యాప్‌' డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని, ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ను రోజూ గమనించాలని సూచించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నుంచి గతేడాది కంటే ముందే నీటిని విడుదల చేశారని, ఈ నెల 25లోగా వరి నాట్లు పూర్తి చేసేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
AP Government
Andhra Pradesh
Groundwater
Water Conservation
Borewell Ban
Kharif Season
Agriculture
Sashi Bhushan Kumar
Manazir Jilani
Farmers App

More Telugu News