కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ
- మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి
- మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు
- ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన
- మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం
గురువారం తెల్లవారుజామున మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు కర్ణాటకలోని చిక్మంగళూరు నుంచి యాత్రికులతో వస్తున్న బొలెరో వాహనం, ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, బొలెరో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.