Yarlagadda Venkata Rao: మాట మార్చడం జగన్ నైజం.. రాజధానిపై ఆయ‌న‌ది విధానం లేని వైఖరి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

Yarlagadda Venkata Rao Slams Jagan on Capital Stance
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర రాజధాని అంశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన విధానం గానీ, నినాదం గానీ లేవని, ఆయన గందరగోళ నిర్ణయాలతో ప్రజలను మోసం చేశారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమాన్ జయంతి, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం వంటి శుభ తరుణంలో అమరావతికి కేంద్రం నుంచి సానుకూల ముందడుగు పడటం రాష్ట్రానికి శుభపరిణామమని అన్నారు.

గతంలో ముఖ్యమంత్రిగా అమరావతిని అంగీకరించిన జగన్, ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో మాట మార్చారని, ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని యార్లగడ్డ ఆరోపించారు. "ఒకరోజు ఒక మాట, మరుసటి రోజు మరో మాట మాట్లాడటం జగన్ రాజకీయాల అసలు స్వరూపం. ఆయన ప్రజలను మోసం చేశారు" అని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంటే, ఏపీలో మాత్రం జగన్ తన రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు.

"అమరావతి సాధారణ ప్రదేశం కాదు. శాతవాహనుల రాజధానిగా, గౌతమ బుద్ధుడు సంచరించిన పవిత్ర బౌద్ధ క్షేత్రంగా దీనికి గొప్ప చారిత్రక ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం చంద్రబాబు నాయుడి దూరదృష్టికి నిదర్శనం" అని యార్లగడ్డ పేర్కొన్నారు. 151 సీట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలను మోసం చేసినందుకే, గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, ఇదే జగన్ విధానాలకు ప్రజలిచ్చిన సరైన సమాధానమని ఆయన ఎద్దేవా చేశారు.

లోక్‌సభలో అమరావతి బిల్లుకు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికితే, వైసీపీ ఎంపీలు వాకౌట్ చేసి ప్రజల ఆకాంక్షలను అవమానించారని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అమరావతిని ఎవరూ కదిలించలేరని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనికి సంపూర్ణ చట్టబద్ధత కల్పిస్తున్నాయని స్పష్టం చేశారు. అమరావతి శాశ్వత రాజధానిగా నిలిచిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Yarlagadda Venkata Rao
Jagan Mohan Reddy
Amaravati
Andhra Pradesh capital
Three capitals
TDP
AP Politics
YS Jagan
Chandrababu Naidu
Gannavaram MLA

More Telugu News