Mallikarjun Kharge: అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

Mallikarjun Kharge Questions Modis Absence at All Party Meeting
షార్ట్స్‌లో చూడండి
పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా బదులివ్వడంతో సభలో కాసేపు వేడి రాజుకుంది.

‘‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మీరు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు?’’ అని ఖర్గే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇంధన ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చకు రాకుండా, ప్రభుత్వం తన అజెండాను ప్రతిపక్షాలపై రుద్దుతోందని ఆయన ఆరోపించారు. తాము ప్రతినిధులను పంపినా ప్రధాని రాలేదని, కేవలం ఉపన్యాసాలు వినడానికి తాము రావాలా అని నిలదీశారు.

ఖర్గే వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు. అదే అఖిలపక్ష సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నేతలు ఎందుకు హాజరు కాలేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ చర్చ నుంచీ వెనక్కి తగ్గడం లేదని, ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని, మంత్రులు ఉభయ సభల్లో ప్రకటనలు చేశారని గుర్తుచేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో దేశంలో గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగొచ్చని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యూహరచన కోసం ప్రభుత్వం సర్వపక్ష భేటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావడం రాజకీయ దుమారానికి కారణమైంది.
Go Back to Shorts
Mallikarjun Kharge
Parliament
All-Party Meeting
Modi
Kiren Rijiju
West Asia Crisis
Iran Israel Conflict
Fuel Prices
Opposition
Political Debate

More Telugu News