Lalit Modi: పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. కావ్య మారన్‌కు లలిత్ మోదీ చురకలు.. 'కాల్ చేయండి' అంటూ ట్వీట్

Kavya Maran faces criticism from Lalit Modi over Pakistan player purchase
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోదీ... సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంగ్లండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' లీగ్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓ పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన వ్యవహారంలో ఆయన పరోక్షంగా చురకలు అంటించారు. వ్యాపార నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తనకు బాగా తెలుసని, అవసరమైతే తనకు కాల్ చేయాలని సూచించడం చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది..?
ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 'ది హండ్రెడ్' పురుషుల లీగ్ వేలంలో కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను 190,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) కొనుగోలు చేసింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో సన్‌రైజర్స్ లీడ్స్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. సాధారణంగా విదేశీ లీగ్‌లలోని భారత ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను తీసుకోకుండా జాగ్రత్తపడతాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సున్నితమైన అంశాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం విస్మరించిందనే ఆరోపణలు వచ్చాయి.

రంగంలోకి లలిత్ మోదీ
ఈ వివాదం ముదురుతున్న వేళ లలిత్ మోదీ 'ఎక్స్‌'లో ఓ పోస్ట్ పెట్టారు. "అభిమానులు ఇప్పటికే అసహనంతో ఉన్నప్పుడు ఒక పాకిస్థానీ ఆటగాడిపై రూ. 2.34 కోట్లు పెట్టుబడి పెట్టడమా? ఆప్టిక్స్ ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలు ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చేయండి" అని రాసుకొచ్చారు. ఇందులో కావ్య మారన్ లేదా సన్‌రైజర్స్ పేరును ప్రస్తావించనప్పటికీ, క‌చ్చితమైన మొత్తాన్ని పేర్కొనడంతో ఇది వారికేనని స్పష్టమవుతోంది.

వివాదాలకు కేరాఫ్ మోదీ
లలిత్ మోదీ 2010లో భారత్ నుంచి పారిపోయి లండన్‌లో నివసిస్తున్నారు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్, ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. 2009లో ఐపీఎల్ ప్రసార హక్కుల విషయంలో దాదాపు రూ. 125 కోట్ల కిక్‌బ్యాక్ తీసుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. గతేడాది డిసెంబర్‌లో భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ ఆయన పోస్ట్ చేయడం కూడా గమనార్హం. ఇప్పుడు మరోసారి ఓ భారత ఫ్రాంచైజీ వ్యవహారంలో తలదూర్చడం ద్వారా లలిత్ మోదీ వార్తల్లో నిలిచారు. విదేశీ లీగ్‌లో తీసుకున్న వ్యాపార నిర్ణయం ఇప్పుడు జాతీయ సెంటిమెంట్‌తో ముడిపడి, లలిత్ మోదీ వంటి వివాదాస్పద వ్యక్తి జోక్యంతో మరింత పెద్దదిగా మారింది.
Go Back to Shorts
Lalit Modi
Kavya Maran
Sunrisers Hyderabad
The Hundred League
Pakistan player
Abrar Ahmed
IPL
Cricket controversy
Indian franchise
England league

More Telugu News