Mohammad Kaif: టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అక్కసు.. గట్టి కౌంటర్ ఇచ్చిన మహమ్మద్ కైఫ్

Mohammad Kaif slams Pakistans Mohammad Amir for comments on Team India
  • పాక్ మాజీ క్రికెటర్ ఆమిర్ వ్యాఖ్యలు పట్టించుకోవద్దన్న కైఫ్
  • అలా మాట్లాడే వారికి ప్రాముఖ్యత ఇవ్వకూడదని సూచన
  • వార్తల్లో నిలవడం కోసం అలా మాట్లాడుతున్నాడని వ్యాఖ్య
  • టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టు ఎంతో వెనుకబడి ఉందన్న కైఫ్
  • 2024లో అమెరికా చేతిలో పాక్ జట్టు ఓటమికి కారణమైన వ్యక్తి మాట్లాడుతున్నాడని ఎద్దేవా
గత కొన్నిరోజులుగా టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ విమర్శలు చేస్తున్నాడు. అభిషేక్ శర్మను 'స్లాగర్' అని, టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌కు వెళ్లదంటూ కక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. వార్తల్లో నిలవడం కోసమే మహమ్మద్ అమీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని, అతడిని పట్టించుకోవద్దని వ్యాఖ్యానించాడు.

కైఫ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ అంశంపై స్పందిస్తూ, టీమిండియా సెమీఫైనల్స్‌కు చేరుకుంటుందనే విషయం నిజంగా అతడికి తెలియదా అని ప్రశ్నించాడు. భారతజట్టు సెమీస్‌కు వెళుతుందని తెలిసినప్పటికీ వార్తల్లో నిలవడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని, అలా మాట్లాడే వారికి మనం ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకూడదని అన్నాడు. అతడి స్థాయికి దిగజారి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ యూఎస్ఏ చేతిలో ఓడిపోయిందని గుర్తు చేశాడు. అప్పుడు సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసింది మహమ్మద్ అమీరేనని పేర్కొన్నాడు. అతడు ఒక బౌండరీ మాత్రమే ఇచ్చాడని, కానీ చాలా వైడ్ బాల్స్ వేశాడని, బంతులు కనీసం స్టంప్ లైన్‌లో కూడా ల్యాండ్ కాలేదని పేర్కొన్నాడు. యూఎస్ఏ జట్టుకు భయపడుతూ బౌలింగ్ చేసి తమ జట్టు ఓటమికి ఎవరు కారణమయ్యారని ఎద్దేవా చేశాడు. ఇంతకుమించి నాకు మాట్లాడాలనిపించడం లేదు అని కైఫ్ అన్నాడు.

అసలు టీమిండియాకు పాకిస్థాన్ జట్టుకు పోలిక లేదని కైఫ్ పేర్కొన్నాడు. మన జట్టు కంటే వారి జట్టు ఎంతో వెనుకబడి ఉందని తెలిపాడు. అలాంటి వారి మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఆ జట్టులో సరైన ఆటగాళ్లు, బౌలర్లు, సమర్థవంతమైన కెప్టెన్ ఇలా ఎవరూ లేరని అన్నాడు.

మన స్థాయికి వారు చేరుకోవడం అసాధ్యమని, అలాంటి వారి వ్యాఖ్యల మీద దృష్టి పెడితే మనం వారికి ప్రాముఖ్యత ఇచ్చినట్లు అవుతుందని అన్నాడు. వాస్తవానికి వారు కోరుకునేది కూడా అదేనని అన్నాడు. కాబట్టి వారి వ్యాఖ్యలకు మనం అంతగా ప్రాధాన్యత ఇవ్వవద్దని అన్నాడు.
Mohammad Kaif
Mohammad Amir
Pakistan Cricket
Team India
T20 World Cup
India vs Pakistan

More Telugu News