ఫలించిన చర్చలు.. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు మళ్లీ ప్రారంభం
- ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇటీవల నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు
- కొనసాగించేందుకు అంగీకరించిన యాజమాన్యాలు
- ప్రభుత్వంతో జరిగిన చర్చలు విజయవంతం
- బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సర్కార్
- కొద్దిరోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన రోగులు
గత కొంతకాలంగా తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు నెట్ వర్క్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో వైద్యం అందక అనేకమంది అవస్థలు పడ్డారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం, ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను, డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీతో సంతృప్తి చెందిన ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్టీఆర్ వైద్య సేవలను పునరుద్ధరించడానికి అంగీకరించాయి. దీంతో రోగులు యథావిధిగా ఈ సేవలను వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది.