బుడమేరు వరదపై వదంతులు .. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ స్పందన
- బుడమేరుపై సోషల్ మీడియాలో వస్తున్నవి వదంతులే
- ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మవద్దన్న ఎన్టీఆర్ జిల్లా సీపీ
- డ్రోన్ కెమెరాలతో వాగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
- బుడమేరు, మున్నేరు ప్రవాహాలు ప్రశాంతంగానే ఉన్నాయి
- తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లాలోని బుడమేరు, మున్నేరు సహా ఇతర ప్రధాన వాగుల పరిస్థితిని పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని సీపీ పేర్కొన్నారు. ఆధునిక డ్రోన్ కెమెరాల ద్వారా ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడా వరద ముప్పు కానీ, ప్రవాహాలు ఉప్పొంగిన దాఖలాలు కానీ లేవని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ రాజశేఖరబాబు హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బుడమేరు నది ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన చిత్రాన్ని విడుదల చేశారు.