గంగాధర పాఠశాల ఘటనపై బండి సంజయ్ కీలక ఆదేశాలు
- బాలికల ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నాడంటూ అటెండర్పై ఆరోపణలు
- నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బీజేపీ నేతల ఆందోళన
- కరీంనగర్ గ్రామీణ ఏసీపీతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని పోలీసులకు ఆదేశించిన బండి సంజయ్
గంగాధరలోని పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న యాకుబ్ అనే వ్యక్తి, బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా, అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు బాధితులు వాపోయారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో దీనిపై స్పందించిన బండి సంజయ్ పోలీసులకు కీలక సూచనలు చేశారు. నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఆయనకు వివరించారు. నిందితుడి వద్ద ఉన్న ఫోన్ను, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకోవాలని, అందులోని వీడియోలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని బండి సంజయ్ సూచించారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.