స్పోర్ట్స్ డ్రామాతో నందమూరి తేజస్విని ఎంట్రీ?: వైరల్ అవుతున్న వార్తలు
- వెండితెరపైకి తేజస్విని ఎంట్రీ ఇస్తున్నారంటూ ప్రచారం
- కథా చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం
- ఇప్పటికే సినీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న తేజస్విని
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అయితే, సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఒక ప్రయోగాత్మకమైన, యువతకు స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఆమె ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కథా చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని, అన్ని అంశాలు కుదిరితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే 'అన్స్టాపబుల్' టాక్ షోకు క్రియేటివ్ హెడ్గా, పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన తేజస్విని... ఇప్పుడు నేరుగా నటిగా మారనున్నారనే వార్తలతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ కంటే ముందే ఆమె సందేశాత్మక చిత్రంతో వెండితెరపై మెరవబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.