పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్
- తిరుపతిలో రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం
- తిరుచానూరులో అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రాధాకృష్ణన్
- అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడి
ఆలయానికి వచ్చిన రాధాకృష్ణన్కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు, ఏపీ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, "ఈరోజు వినాయక చవితి పర్వదినం. ఇంతటి పవిత్రమైన రోజున పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను" అని తెలిపారు.
అంతకుముందు, రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రి నారాయణ, టీటీడీ చైర్మన్ నాయుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, దివాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటు వేసే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.