రాహుల్ గాంధీ అరెస్ట్.. ఢిల్లీలో హైటెన్షన్
- ఈసీ కార్యాలయానికి కూటమి ఎంపీల ర్యాలీ
- అడ్డుకున్న పోలీసులు.. ఖర్గే, అఖిలేశ్ యాదవ్ సహా పలువురి అరెస్ట్
- ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
లోక్ సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేందుకు ఈ రోజు విపక్ష కూటమి ఎంపీలంతా ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహించేందుకు తలపెట్టగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
సంసద్ మార్గ్ను బ్లాక్ చేశారు. భేటీకి 30 మందికి అనుమతిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించగా.. అందరం కలిసే వెళతామని ఇండియా కూటమి ఎంపీలు పట్టుబట్టారు. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లు ఎక్కి అవతలకు దూకి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.