దలైలామా భారత్ లో ఉండడం మా అదృష్టం: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
- ధర్మశాలలో దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు
- పాల్గొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
- వారసుడి ఎంపికపై చైనాకు భారత్ గట్టి హెచ్చరిక
- దలైలామా సంస్థ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని స్పష్టీకరణ
- తమ ఆమోదంతోనే ఎంపిక జరగాలంటున్న చైనా
- బయటి జోక్యాన్ని తిరస్కరించిన దలైలామా
దలైలామా వారసుడిని బీజింగ్ ఆమోదించిన పద్ధతుల ప్రకారమే ఎంపిక చేయాలని, టిబెట్ సంబంధిత విషయాల్లో భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలని ఇటీవల చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. "దలైలామా సంస్థ, దాని సంప్రదాయాలు, కట్టుబాట్ల ప్రకారం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేం పూర్తిగా కట్టుబడి ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది భక్తుల తరఫున నేను ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను" అని ఆయన అన్నారు.
ఈ వేడుకల్లో రిజిజు మాట్లాడుతూ, "దలైలామా కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు. ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక ప్రపంచానికి మధ్య ఆయనొక సజీవ వారధి" అని కొనియాడారు. 'ఆర్యభూమి'గా భావించే మన దేశంలో ఆయన ఉండటం మనందరికీ ఆశీర్వాదమని పేర్కొన్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా దలైలామా మాట్లాడుతూ, "మేం మా దేశాన్ని కోల్పోయి, భారత్లో ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ.. ఇక్కడి నుంచే ఎంతో మందికి సేవ చేయగలుగుతున్నాను. నా శಕ್ತಿ మేరకు జీవులకు సేవ చేయాలన్నదే నా ఉద్దేశం" అని తెలిపారు. తన వారసుడిని, తాను స్థాపించిన భారత ఆధారిత 'గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్' ఎంపిక చేస్తుందని, ఇందులో బయటి శక్తుల జోక్యం ఉండదని దలైలామా ఇప్పటికే తేల్చిచెప్పడం గమనార్హం. షిమ్లా సమీపంలోని దోర్జిడాక్ మొనాస్టరీలో కూడా టిబెటన్ బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.