తెలంగాణ కాంగ్రెస్లో కీలక పదవిలో అజారుద్దీన్ కుమారుడు అసద్..గర్వంగా ఉందన్న మాజీ కెప్టెన్
- టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్
- కొడుకు నియామకంపై అజారుద్దీన్ హర్షం, ఎక్స్లో భావోద్వేగ పోస్ట్
- టీపీసీసీలో 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శుల నియామకం
- టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా భర్త అసదుద్దీన్
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి మృతితో అజార్కు ఉప ఎన్నికలో ఛాన్స్?
మంగళవారం అజారుద్దీన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, "నా కుమారుడు, మహమ్మద్ అసదుద్దీన్, తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రజా జీవితంలోకి అధికారికంగా అడుగుపెట్టడం నాకు ఎంతో గర్వంగా, భావోద్వేగంగా ఉంది" అని పేర్కొన్నారు. "ప్రజల పట్ల అతనికున్న నిబద్ధత, సేవా దృక్పథం, నిజాయతీలను నేను దగ్గరగా చూశాను. అతను వినమ్రంగా, ఏకాగ్రతతో, నిజమైన విలువలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ బాధ్యతను స్వీకరిస్తున్న అతనికి నా శుభాకాంక్షలు" అని అజారుద్దీన్ తన పోస్టులో రాశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి 27 మంది ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అజారుద్దీన్ మొదటి భార్య కుమారుడైన అసదుద్దీన్ ఒక దేశవాళీ క్రికెటర్. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాను ఆయన వివాహం చేసుకున్నారు.
అజారుద్దీన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో అజారుద్దీన్పై 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జూన్ 8న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను మరోసారి బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో రాజస్థాన్లోని టోంక్-సవాయ్ మాధోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.